Kalyan Singh: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ (89) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ సింగ్ తుది శ్వాస విడిచారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో కళ్యాణ్ సింగ్ బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గత నెల 4వ తేదీ లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టుగ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐ) లోని ఐసీయూలో చేర్చారు. రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కళ్యాణ్ సింగ్ రెండు పర్యాయాలు యూపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు.
1999లో బీజేపీ వీడి బయటకు వెళ్లిన కళ్యాణ్ సింగ్ సొంత పార్టీ స్థాపించారు. 2004లో తన పార్టీలో బీజేపీలో విలీనం చేశారు. మళ్లీ 2009 లో బీజేపీని వీడి స్వతంత్ర అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో మరల బీజేపీకి చేరిన కళ్యాణ్ సింగ్ తరువాత రాజస్థాన్ గవర్నర్ గా అయిదేళ్లు బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రాజ్ వీర్ సింగ్ ప్రస్తుతం ఎంపిగా ఉన్నారు. కళ్యాణ్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తదితర సీనియర్ నేతలు పరామర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా లు కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.
కళ్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.