ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. వెండి ఇటుకతో ఆయన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే రామ మందిర నిర్మాణం కోసం మోదీ రూ.50 కోట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఇచ్చారనే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే మోదీ సీఎం యోగికి ఓ లేఖ కూడా రాశారని ఓ లెటర్ను ప్రస్తుతం కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే నిజంగానే మోదీ ప్రత్యేకంగా రూ.50 కోట్లను రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చారా..? అంటే.. కాదు.. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేలింది.
అయోధ్య రామమందిర నిర్మాణానికి మోదీ రూ.50 కోట్లు ఇవ్వలేదని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. అలాగే మోదీ సీఎం యోగికి ఎలాంటి లేఖ కూడా రాయలేదని తేలింది. ఆ లేఖలో యోగిని మోదీ పొగుడుతున్నట్లు రాసి ఉంది. హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం మీరు మీ టీం భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉందని, రూ.50 కోట్లను రామ మందిర నిర్మాణం కోసం పంపుతున్నానని.. ఆ లేఖలో మోదీ రాసినట్లుగా ఉంది. అయితే అదంతా ఫేక్ అని తేల్చారు. ఆ లేఖతోపాటు మోదీ రామ మందిర నిర్మాణం కోసం రూ.50 కోట్లను సీఎం యోగికి ఇచ్చారన్న వార్తలోనూ నిజం లేదని వెల్లడైంది.
Claim: A Facebook user, has posted a letter, allegedly written by PM @narendramodi to Chief Minister of #UttarPradesh @myogiadityanath#PIBFactCheck: This letter is #Fake pic.twitter.com/9dHdcEEMu4
— PIB Fact Check (@PIBFactCheck) August 9, 2020
కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని ఇటీవలే రామ జన్మభూమి తీర్థ ట్రస్టు ప్రకటించింది. ఇప్పటికీ ఇంకా అందుకు గాను విరాళాలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.