ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్కు గాను అనేక మంది సైంటిస్టులు వ్యాక్సిన్లను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్లు ప్రస్తుతం ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. అయితే ఈ విషయం తెలిసి కూడా.. కోవిడ్కు వ్యాక్సిన్ ఇంకా రాలేదని తెలిసినా.. కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాజాగా కోవిడ్ క్యూర్ పట్ల మరో ఫేక్ వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతోంది.
పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందిన రాము అనే విద్యార్థి కోవిడ్ 19కు మందును కనుగొన్నాడని, దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీకరించిందని.. చెబుతూ ఓ సోషల్ మీడియా మెసేజ్ తెగ ఫార్వార్డ్ అవుతోంది. ఇక అందులో ఇంకా ఏముందంటే.. 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా అల్లం రసంలను కలిపి 5 రోజుల పాటు వాడితే కోవిడ్ పూర్తిగా 100 శాతం నయమవుతుందని.. ప్రపంచం ఈ చికిత్సను అంగీకరిస్తుందని.. మొత్తానికి ఈ ఏడాది గుడ్ న్యూస్ విన్నామని.. కూడా ఉంది.
అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేదని.. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని మీడియా సంస్థలు తేల్చాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గుర్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సదరు వార్త పూర్తిగా ఫేక్ అని తెలిపారు. తమ యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరూ అలాంటి మందును కనుగొన లేదని, ఆ వార్తను ఎవరూ నమ్మవద్దని కోరారు.
కాగా నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా కోవిడ్ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వలేదు. అసలు వ్యాక్సినే తయారు కానప్పుడు ఆ సంస్థ అయినా దేనికి అనుమతిస్తుంది ? కనుక ఇలాంటి ఫేక్ వార్తలను అస్సలు నమ్మకండి. నమ్మి మోసపోకండి.. అయితే నిజానికి తేనె, నల్ల మిరియాల పొడి, అల్లం రసంల మిశ్రమం దగ్గు, జలుబులను తగ్గిస్తుంది. కోవిడ్లో ఈ రెండు లక్షణాలు కొందరికి ఉంటాయి. కనుక ఆ లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు, శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మాత్రం ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. అంతేకానీ.. దాంతో కరోనా పూర్తిగా నయం అయితే కాదు. వైద్యుల సూచనల మేరకు మందులను కూడా వాడాల్సిందే..!