సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫేక్ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక టెలికాం సంస్థ జియోకు సంబంధించి అనేక ఫేక్ వార్తలు గతంలో ప్రచారం అయ్యాయి. తాజాగా మరొక వార్త విపరీతంగా షేర్ అవుతోంది. అందులో ఏముందంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనికుల్లో 6వ స్థానానికి చేరుకున్నారని.. అందుకని జియో కంపెనీ 99వేల మంది జియో కస్టమర్లకు రూ.349 రీచార్జిని ఉచితంగా అందజేస్తుందని, ఈ ఆఫర్ ఎప్పుడైనా ముగియవచ్చని.. చెబుతూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేదని, పూర్తిగా అబద్ధమైన వార్త అని తేలింది.
జియో ప్రతినిధి ఒకరు ఈ వార్తపై స్పందిస్తూ.. ఇది ఫేక్ వార్త అని తేల్చారు. ఇలాంటి ఆఫర్ దేన్నీ జియో ప్రస్తుతం అందించడం లేదని తెలిపారు. అలాగే ఆ మెసేజ్లో ఉన్న సైట్ అచ్చం జియో వెబ్సైట్ను పోలి ఉన్నప్పటికీ.. అది నకిలీ సైట్ అని అన్నారు. అందువల్ల అందులో వినియోగదారులు తమ వివరాలను నమోదు చేసి దుండగుల చేతుల్లో మోసపోవద్దని హెచ్చరించారు.
కాగా ఆ మెసేజ్లో ఉన్న సైట్ను ఓపెన్ చేసి.. అందులో వినియోగదారుడు తన పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలు అన్నింటినీ నమోదు చేశాక.. ఆఫర్ను అందుకోవాలంటే.. ఆ మెసేజ్ను మరో 10 మందికి షేర్ చేయాలి.. అని చూపిస్తోంది. అందువల్ల ఈ మెసేజ్ ఫేక్ అని తేల్చారు. ఎవరూ దాన్ని ఓపెన్ చేయకూడదని, ఇతరులకు ఆ మెసేజ్ను షేర్ చేయకూడదని అంటున్నారు.