భారత్ ఆర్మీ లో మేజర్ అని కలర్ ఇస్తాడు. నెలకు మూడు లక్షల జీతం వస్తుంది అని చెబుతాడు. రూపాయి కట్నం అక్కర్లేదు అంటాడు. సంబంధం నచ్చింది.. ముహూర్తాలు పెట్టడం అని కంగారు పెడతాడు. అంత లోనే అత్యంత అవసరమని కొంత మొత్తం డబ్బు సర్దండి టాక్స్ పే చేయాలంటూ హడావుడి చేస్తాడు. లేకపోతే తన ఉద్యోగానికి కూడా ప్రమాదమని వేషాలు వేస్తాడు. చివరకు పెళ్లికూతురు తరపు దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు కాజేసి పరారు అవుతాడు. ఇది ఒక టెన్త్ క్లాస్ చదివి, సులభంగా డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నిన ఓ యువకుడి కథ పూర్తిగా చదివేయండి.
17మంది దగ్గర 8.25 కోట్లు
ప్రకాశం జిల్లా పలుగురాళ్ళ తండాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ 10 వ తరగతి చదువుకున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న శ్రీను భార్య ఏదైనా వైద్య కోర్సులు చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని సూచించింది. ఆమె కూడా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తుండడంతో కనీసం ఔట్సోర్సింగ్ పద్ధతిలో అయినా భర్తకు ఉద్యోగం ఇప్పించవచ్చు అని హైదరాబాద్ కు పంపింది. ఉప్పల్లో ఓ గది అద్దెకు తీసుకుని కాలక్షేపం చేసిన శ్రీను విలాసాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించే దారులు వెతికాడు. సోషల్ మీడియాలో తాను ఆర్మీ మేజర్ నంటూ ఫోటోలు పెట్టి హల్చల్ చేసేవాడు. ఇక్కడినుంచే అసలు కథ మొదలైంది.
ఆలోచింపజేసిన వార్త:
శ్రీను ఒకరోజు హోటల్లో పేపర్ చదువుతూ ఉండగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 28 మందిని పెళ్లి చేసుకున్నట్లు, అందరి వద్ద నుంచి కట్నంగా భారీగా డబ్బు రాబట్టుకొని పరారైనట్లు ఓ వార్త చదివాడు. దీంతో శ్రీను కు సరికొత్త ఆలోచన వచ్చింది.
ఆర్మీ మేజర్ గా పరిచయం చేస్కుంటూ ఇదే తీరున కొన్ని మ్యాట్రిమోనీ లకు ఫోటోలు పంపాడు. ఆర్థికంగా బాగా డబ్బున్న వారిని టార్గెట్ గా చేసుకునేవాడు. సంబంధానికి వెళ్లడం అక్కడ నీతులు చెప్పడం, కట్నం అవసరం లేదని, కట్నం తీసుకోవడం చాలా తప్పు అంటూ వాదించేవాడు. శ్రీను ప్రవర్తన ఎవరికీ అనుమానం రాకుండా ఉండేది. పెళ్లి సంబంధం ఓకే అయ్యాక, పెళ్లికూతురు తరుపు బంధువుల తో తనకు అర్జెంట్ అవసరం ఉందని, కొద్ది మొత్తం డబ్బు అత్యవసరంగా సర్దాలి అనీ తొందర పెట్టే వాడు. ఆదాయపు పన్ను టాక్స్ అంటూ హడావుడి చేసే వాడు. అమ్మాయి తరపు బంధువులు ఎంతోకొంత సభ్యులు తర్వాత శ్రీను నాయక్ మాయమైపోయాడు. ఇలా 17 మందిని మోసం చేసాడు.
ఐఐటీ దెబ్బకొట్టింది:
శ్రీను నాయక్ తన మోసాల్లో భాగంగా ఇటీవల ఐఐటి ఖరగ్పూర్లో చదివిన ఓ విద్యార్థిని టార్గెట్ చేసాడు. డిఫెన్స్ అకాడమీ లో డిగ్రీ చదివానని ఐఐటి చెన్నైలో సైతం తాను చదువుకున్నట్లు చెప్పుకొనే వాడు. అతడి మాట తీరు వ్యవహారశైలి పట్ల సదరు యువతికి అనుమానం వచ్చి శ్రీను నాయక్ అసలు విషయాన్ని శోధించింది. పరిశీలనలో శ్రీను నాయక్ అసలు ఐఐటి చెన్నై లోకి రాలేదని తేలింది. దీంతో ఆమె హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. విచారణలో భాగంగా శ్రీను నాయక్ వరంగల్ కు చెందిన ఓ యువతి తండ్రి దగ్గర నుంచి దాదాపు రెండు కోట్ల మేర దండుకున్నట్లు తేలింది. అలాగే ఓ వైద్యురాలు వద్ద 50 లక్షలు సచివాలయ ఉద్యోగుల 52 లక్షలు మేర టోపీ వేసాడు. అయితే పరువు పోతుందనే భయంతో వారు ఎవరు బయటకు రాలేదు. మ్యాట్రిమోనీ లో పెళ్లి సంబంధాలు చూసుకునే అప్పుడు పూర్తి వివరాలు వారి యొక్క బ్యాక్ గ్రౌండ్ ను కనుక్కొని చేసుకుంటేనే మంచిది. అన్నట్లు చివరిగా… శ్రీను నాయక్ తాను ఉన్నత శ్రేణి వ్యక్తిగా చెప్పుకునేందుకు దాదాపు రెండు కోట్లు లో విల్లా కారు ఇతర సౌకర్యాలు సమకూర్చుకున్న ట్లు పోలీసు విచారణలో తేలింది.