సోషల్ మీడియాకు గోరంత దొరికితే చాలు.. కొండంత ప్రచారం జరిగిపోతుంది. తాజాగా పాకిస్థాన్ లోని బాలాకోట్ వద్ద గల ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసి ఉగ్రవాదులను అంతమొందించిన తర్వాత.. అందుకు సంబంధించిన ఫొటోలు ఇవేనంటూ రకరకాల ఫొటోలు తీసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసేస్తున్నారు. ఇలాంటి కొన్ని ఫొటోలు తాజాగా దర్శనమిచ్చాయి. అవి ఏంటా అని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒక్కోటీ ఒక్కో రకం ఫొటోలని తేలింది. సామూహిక ఖననం చేసిన శవాలు, ఇతర మృతదేహాల గుట్టల ఫొటోలు ఎక్కడెక్కడి నుంచో తీసి వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇదే బాలాకోట్ దాడులకు సాక్ష్యమని, దేశద్రోహులు ఇప్పటికైనా మీ ముఖాలను మీ చెప్పులతోనే కొట్టుకుని, నోళ్లు మూసుకోవాలి తప్ప వైమానిక దళాన్ని అపహాస్యం చేయద్దని వాటికి కేప్షన్లు పెడుతున్నారు. అలాగే ఇదిగో సాక్ష్యం.. కళ్లజోడు పెట్టుకుని సరిగా చూడండి అని కూడా అంటున్నారు.
కానీ తీరా ఆ ఫొటోలను డౌన్ లోడ్ చేసి, గూగుల్ సాయంతో రివర్స్ సెర్చింగ్ చేస్తే.. అసలు విషయం కాస్తా బయటపడుతోంది. వాటిలో ఒక ఫొటోను చూసినపుడు గెట్టీ ఇమేజెస్ ఫొటో అని తేలింది. అది కూడా 2015 జూన్ 26వ తేదీన కరాచీలో విపరీతమైన వడగాలులు రావడంతో కొంతమంది మరణించగా, వారి శవాలను పాకిస్థానీ ఈదీ చారిటీ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు సామూహికంగా ఖననం చేశారని, 50 మంది శవాలను ఇలా పూడ్చిపెట్టారని వివరణ ఉంది.
అలాగే మరో ఫొటోలో ఒక వ్యక్తి పలు శవాలకు తెల్లటి వస్త్రాలు కప్పుతున్నట్లుగా ఉంది. దాన్ని కూడా ఇలాగే గూగుల్ ద్వారా పరిశీలిస్తే అది కూడా గెట్టీ ఇమేజెస్ ఫొటోగానే స్పష్టమైంది. అది 2015 నాటిది. ఆ మృతదేహాలన్నీ ఎవరూ గుర్తుపట్టని అనాథ శవాలు కావడంతో.. సదరు వ్యక్తి వాటి మీద గుర్తులతో కూడిన పత్రాలు పెడుతున్నారు. ఇలాంటి ఫొటోలను తీసుకుని వాటిని బాలాకోట్ వైమానిక దళ దాడులకు సాక్ష్యం అంటూ కొన్ని గ్రూపులకు చెందినవాళ్లు ప్రచారం చేస్తున్నారని ఆల్ట్ న్యూస్ అనే పాకిస్థానీ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.