ఉప ఎన్నికల పోలింగ్ వేళ దుబ్బాక నియోజకవర్గంలో ఒ అసత్య ప్రచారంపై తీవ్ర స్థాయిలో చర్చజరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నాడంటూ అసత్య ప్రచారం జరిగింది. టీవీ 9లో ఈ వార్త వచ్చినట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీ నేతల కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. మరో పక్క టీవి 9 యాజమాన్యం కూడా అది మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారంటూ పేర్కొన్నది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.
టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ అసత్య ప్రచారాన్ని ఖండించారు. దీని వెనుక మంత్రి హరీష్ రావు, బీజెపీ అభ్యర్థి రఘునందరావులు ఉన్నారనీ, వారు ఇద్దరు దగ్గరి బంధువులని ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఓటమి భయంతో ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నది ఆయన అన్నారు. దీనిపై హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు అందజేశారు.
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడైన శ్రీనివాసరెడ్డి నామినేషన్ల పర్వంకు ముందు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం కోసం మంత్రి హరీష్ రావు అన్నీ తానే అయి ప్రచార పర్వాన్ని నిర్వహించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అని భావించారు. అయితే ఇటీవల కాలంలో బీజెపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందినవిగా భావిస్తున్న నగదు పెద్ద మొత్తంలో సీజ్ చేయడం, మరో పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పై అసత్య ప్రచారం చూస్తుంటే కీన్ కాంటెస్ట్కు చేరిందని భావిస్తున్నారు.