NTR-Bharat Ratna: ఎన్టీఆర్-భారతరత్న.. NTR-Bharat Ratna ఈ అంశం తెర మీదకు ఏడాదికి ఒక్కసారి వస్తుంది. ప్రతి ఏటా మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో, కొన్ని మీడియా వర్గాల్లో ప్రస్తావనకు వస్తుంది. ఇలా ఏడాది గడచిపోతుంది. మళ్లీ.. ఈ అంశం ప్రస్తావనకు వచ్చేది మరుసటి ఏడాది ఆయన జయంతికే. ఇలా.. ఏడాదికోసారైనా ఈ విషయంపై మాట్లాడుతున్నందుకు బహుశా.. ఎన్టీఆర్ ఆత్మ ఘోషించక.. సంతోషిస్తుందేమో. నిజమే మరి.. ప్రతి ఏడాది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మాట్లాడటం.. పార్టీ నాయకులు వంత పాడటం జరుగుతోంది. ఇప్పుడే కాదు.. గత ఐదేళ్ల తన హయాంలోనూ ఇదే పరిస్థితి. కానీ.. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.
ఈ విషయంలో చంద్రబాబు & కో నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు బీజేపీతో మంచి స్నేహం ఉంది. బీజేపీ-టీడీపీ కలిసే ఎన్నికల్లో పోటీ చేసాయి.. కేంద్రంలో మోదీ ప్రధాని, ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. నిజంగా టీడీపీ శ్రేణులకు ఎన్టీఆర్ కు భారతరత్న సాధనపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాకపోయినా.. బీజేపీతో స్నేహం ఉన్న మూడేళ్లలో ఎప్పుడైనా ఆ పని చేసుండేవారు. కానీ.. అలా చేయలేదు. ఎన్టీఆర్ పై తమకు గౌరవం ఉందని ప్రజల్లో చెప్పుకోవడం.. పార్టీ శ్రేణులను మెప్పించడం, డిమాండ్ చేస్తూనే ఉన్నాం.. కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పుకోవడం. ఇంతకుమించి అడుగు ముందుకుపడలేదన్నది నిజం. ఇందుకు కారణాలు లేకపోలేదని చెప్పాలి.
Read More:NT Rama Rao: ఎన్టీఆర్ ప్రస్థానం..! తెలుగోడు.. ఎన్టీవోడు.. కారణజన్ముడు..
నిజంగా కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే.. ఆ అత్యున్నత పురస్కారం అందుకోవాల్సింది ఆయన భార్య లక్ష్మీపార్వతి. గతంలో పరిస్థితులు చూసినా.. ఇప్పుడైనా ఆమె టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి వ్యతిరేకమే. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఎన్టీఆర్ భార్య హోదాలో తీసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే ఓ డిమాండ్ చేసి ఊరుకుంటున్నారు కానీ.. కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదనే వాదనా లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఉన్నారు. ఆమె కూడా ఎప్పుడూ ప్రయత్నాలు, డిమాండ్ చేసింది లేదు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం.. భారతరత్న డిమాండ్లన్నీ టీడీపీ నాయకుల నీటిపై రాతలే అయితే.. ఎన్టీఆర్ ఆత్మ శాంతించేది ఎప్పుడు?