ప్రముఖ సినీ రచయిత వెన్నెకంటి కన్నుమూశారు. గుండె పోటుతో ఆయన నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. అయితే ఆయన ఇంటిపేరుతోనే పాపులర్ అయ్యారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంతో వెన్నెలకంటి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. దాదాపు 300 చిత్రాలకు పైగా రెండువేలకు పైగా పాటలను వెన్నెలకంటి రాశారు.
సినీరంగంలోకి రాకముందు వెన్నెలకంటి 1979లో చంద్రగిరిలో స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా చేరారు. ఆయన భార్య పేరు ప్రమీలా కుమారి, ఇద్దరు కుమారులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి. ఈ ఇద్దరు సినీ రంగంలోనే రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాల మాటల రచయితగా ఎదిగారు. చిన్న కుమారుడు రాకేందు మౌళి గీత రచయితగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.