మెగాస్టార్ చిరంజీవి వరసగా మూడు సినిమాలను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన ఈ సినిమా తిరిగి త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది.
కాగా ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్నారు మెగాస్టార్. వాస్తవంగా అయితే ఈ సినిమా కి సంబంధించిన ప్రకటన ఈ నెలలోనే వస్తుందని భావించారు. ప్రచారం కూడా అలానే జరిగింది. దసరా పండగ సందర్భంగా ఈ సినిమాని అధికారకంగా ప్రకటించి 2021 మార్చ్ నుంచి మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రకటనే రాలేదు.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం ఈ రెండు సినిమాలకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘వేదాళం’ రీమేక్ లో మెగాస్టార్ కి చెల్లెలిగా స్టార్ హీరోయిన్ ఎంచుకున్నట్టు సమాచారం. ఆ స్టార్ హీరోయినే కీర్తి సురేష్.
ఇందులో వాస్తవం ఎంత అన్నది మేకర్స్ అధికారకంగా వెల్లడిస్తే గాని తెలియదు. అయితే కొంతమంది అభిమాను మాత్రం కీర్తి సురేష్ ని చెల్లెలి పాత్రలో చూడటానికి ఇష్టపడం లేదన్న టాక్ వినిపిస్తుంది. హీరోయిన్ గానే చూడాలని భావిస్తున్నారట. అంటే మెగాస్టార్ కి జంటగా నటించాలన్నది వారి కోరిక. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.