ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద 2020 ఖరీఫ్ సీజన్కు గాను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న రైతులు తమ పంటలకు బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులందరికీ అందజేస్తోంది. ఇందులో రైతులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తృణధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పంటలకు బీమా మొత్తంలో 2 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే వాణిజ్య, హార్టికల్చర్ పంటలకు అయితే బీమా మొత్తంలో 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఇక ఫసల్ బీమా యోజన కింద రైతులు బీమా తీసుకునేందుకు గాను దరఖాస్తులకు జూలై 31, 2020ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ క్రమంలో రైతులు pmfby.gov.in అనే అధికారిక వెబ్సైట్లోనూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే play.google.com/store/apps/details?id=in.farmguide.farmerapp.central అనే ప్లే స్టోర్ యాప్లోనూ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద రైతులు బీమా తీసుకుంటే తమ పంటలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించుకోవచ్చు. విత్తనాలు నాటే దశ నుంచి పంట నూర్పిడి దశ వరకు ఈ బీమా వర్తిస్తుంది. అలాగే కరువు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు.. తదితర అవాంఛనీయ సంఘటనల ద్వారా జరిగే నష్టాలకు కూడా ఈ పథకం కింద పంటలకు రైతులు బీమా పొందవచ్చు.
రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు తమకు సమీపంలోని బ్యాంకు లేదా ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్, గ్రామ స్థాయి అధికారులు, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించవచ్చు. లేదా పైన తెలిపిన వెబ్సైట్, యాప్లను కూడా ఉపయోగించుకోవచ్చు. పలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సమాచారం ఇస్తారు.
రైతులు ఫసల్ బీమా యోజన కింద దరఖాస్తు చేసుకునేందుకు తమ ఆధార్ నంబర్, బ్యాంక్ పాస్బుక్, ల్యాండ్ రికార్డు పత్రాలు లేదా కౌలు అగ్రిమెంట్, సెల్ఫ డిక్లరేషన్ సర్టిఫికెట్ అవసరం అవుతాయి. ఇక రైతులకు తమ దరఖాస్తు, ఇతర వివరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ముఖ్యమైన సమాచారాన్ని పంపిస్తారు.