విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, టిడిపి నేత జలీల్ ఖాన్ కూతురు షబానాపై మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. నగర మాజీ మేయర్ మల్లికా బేగం ఫిర్యాదు మేరకు మత పెద్ద మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ నిర్ణయం తీసుకున్నారు.
2009 ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ టికెట్ను మల్లికా బేగంకు కేటాయించింది. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ మల్లికా బేగంపై మత పెద్దలతో ఫత్వా జారీ చేయించారు.
రానున్న ఎన్నికల్లో తన కూతురు పోటీ చేస్తుందని జలీల్ ఖాన్ ప్రకటించటంతో..మళ్ళీ ఫత్వా రగడ మొదలయింది. ‘ నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షా ‘ అన్నట్లు ఇప్పుడు జలీల్ ఖాన్ కూతురుపై నాడు దెబ్బ తిన్న మల్లికా బేగం ప్రతీకారానికి పూనుకున్నది.
నాడు నాకు ఫత్వా జారీ చేసిన మత పెద్దలు ఈమెకెందుకు జారీ చేయరంటూ మల్లికా బేగం ప్రశ్నించింది. సోమవారం ఏకంగా మత పెద్దల ఇళ్ల ముందే ఆందోళన చేయటానికి వెళ్ళింది. దీంతో మత పెద్దలు జలీల్ ఖాన్ కుమార్తెపై ఫత్వా జారీ చేశారు.