ప్రస్తుతం కోరోనా ఉధృతి కొంచెం తగ్గడంతో రైలు ప్రయాణాలకు కూడా అనుమతిస్తున్నారు. కానీ.. ఇది వరకులా కాదు. కొన్ని ముఖ్యమైన రైళ్లను మాత్రమే రైల్వే శాఖ నడుపుతోంది. అది కూడా ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. జనరల్ కంపార్ట్ మెంట్లు ఉండవు. ముందు టికెట్ బుక్ చేసుకొని.. కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటేనే రైల్వే స్టేషన్ లోనికి అనుమతిస్తారు.
అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రైలులో కరోనా సోకిన వాళ్లు ఉంటే… వాళ్ల వల్ల వందల మందికి సోకే అవకాశం ఉంటుంది కదా. అందుకే రైల్వే శాఖ ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా సోకిన వాళ్లు… రైళ్లలో ప్రయాణిస్తే రైల్వే శాఖ వాళ్లపై కఠిన చర్యలు తీసుకోబోతోంది.
దానికి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) మార్గదర్శకాలను విడుదల చేసింది. భవిష్యత్తులో వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో… కరోనా టెస్టులు చేయించుకోకుండా రైలు ఎక్కడం, ఎటువంటి కరోనా నిబంధనలు పాటించకపోవడం, కరోనా సోకినా ప్రయాణాలు చేయడం.. లాంటివి చేస్తే వాళ్లకు ఫైన్ వేయడంతో పాటు.. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని ఆర్పీఎఫ్ పేర్కొన్నది.
కరోనా వ్యాప్తికి కారణమయ్యేలా ఏం చేసినా కూడా అది నేరం కిందికే వస్తుందని.. అందుకే వాళ్లకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఆర్పీఎఫ్ పేర్కొంది.