అమరావతి: దళిత మహిళా ఎస్ఐని దూషించిన కేసులో టిడిపి సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. నన్నపనేని తనను కులం పేరుతో దూషించారని మహిళా ఎస్ఐ అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 303,506, 509, రెడ్ విత్ 34ల కింద కేసు నమోదు చేశారు.
నిన్న చలో టిడిపి తలపెట్టిన చలో ఆత్మకూరుకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నేతలను అడ్డుకొని హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పాయికరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వీరు పోలీసుల తీరుపై వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంలో నన్నపనేని అనుచితంగా ప్రవర్తించారంటూ మహిళా ఎస్ఐ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ దళితులకు న్యాయం చేయడమే తనకు వచ్చని, దూషించడం రాదని అన్నారు. ఆ ఎస్ఐది ఏ కులమో తనకు తెలియదనీ, ఎస్ఐపై తాను దుర్భాషలాడినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని నన్నపనేని అన్నారు.
టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ దళిత మహిళా ఎస్ఐని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం డ్రామాలాడుతోందని విమర్శించారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదని ఆమె అన్నారు.
మరో వైపు ఐపిఎస్ అధికారి విక్రాంత్ పాఠిల్పై అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్ఐ కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.