(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి)
విశ్రాంత అధ్యాపకుడు కోడె రాజా రామ్మోహన్ రావు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో సహా ఆయన బంధువులపై మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కేసు నమోదు అయ్యింది.
సీ ఆర్ డి ఏ పరిధిలోని కృష్ణాయపాలెం లో దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల భాగస్వామంలో నిర్మిస్తున్న లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో తనకు రెండు ప్లాట్స్ కు గానూ 75లక్షలు నగదు తీసుకొని ఒకటి మాత్రమే రిజిస్టర్ చేశారని, దీనిపై వారిని అడిగితే జైలులో పెట్టిస్తామని బెదిరించారని విశ్రాంత అధ్యాపకుడు రాజా రామ్మోహన్ రావు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. తనకు ప్లాట్ విక్రయించే సమయంలో అపార్ట్మెంట్ పక్కన స్టార్ హోటల్స్ వస్తాయని నమ్మించి మోసం చేశారని పిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పిర్యాదు మేరకు దమ్మాలపాటి శ్రీనివాస్ బావమరిది క్యాపిటల్ హౌసింగ్ లిమిటెడ్ ఎండి నన్నపనేని సీతారామరాజు, కేవిజి కృష్ణుడు, ఆయన భార్య అడుసుమల్లి తనూజ, దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణి, పొట్లూరి అనంత లక్ష్మి పై పోలీసులు కేసు నమోదు చేశారు.