చెన్నై, ఫిబ్రవరి 24: చెన్నై శివారులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోరూర్ వద్ద ఒక ప్రైవేటు పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 300 కార్లు దగ్ధం అయ్యాయి. ఐదు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు సందర్శించి విచారణ చేస్తున్నారు.
కర్నాటక రాజధాని బెంగళూరులో ఏరో ఇండియా 2019 ప్రదర్శన వద్ద శనివారం అగ్నిప్రమాదం జరిగి పెద్ద ఎత్తున వాహనాలు అగ్నికి అహుతి అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే తమిళనాడు రాజధాని చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
రెండు రోజుల క్రితం చెన్నై శివారు సవితా ఇంజనీరింగ్ కళాశల ఆవరణలోని బాలుర వసతి గృహంలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్టల్ బిల్డింగ్ నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగగా మొత్తం గదులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో విద్యార్థులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కల్గిస్తున్నాయి.