హైదరాబాద్, జనవరి 30: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గ్రౌండ్ లోని ఆంధ్రబ్యాంకు స్టాల్ లో విద్యుత్ షార్ట్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు.
ఈ మంటల కారణంగా పక్క స్టాల్ లో గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలు సమీపంలోని షాపులన్నింటికీ వ్యాపించాయి. ఒక్క సారిగా మంటలు ఎగిసి పడటంతో ప్రజలు, షాపుల నిర్వహకులు ఉరుకులు పరుగులు పెట్టారు. 19 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేస్తున్నారు.
గ్రౌండ్ లో రెండు వేలకు పైగా స్టాల్స్ ఉండగా 200లకు పైగా షాపులు తగులబడ్డాయి. ఇద్దరికి కాలిన గాయాలు కాగా మంటల ధాటికి మరో 17మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని అసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
ఆస్తి నష్టం భారిగా ఉంటుందని భావిస్తున్నారు. జిహెచ్ ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ , కమిషనర్ లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలిస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో నాంపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సందర్శకులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు మెట్రో ట్రైల్ లో ఉచిత ప్రయాణంకు అవకాశం కల్పించారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి మహబూబ్ అలీ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.