మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ నౌకలలో ఇండియా, టర్కీ, లిబియా దేశాలకుకు చెందిన సిబ్బంది ఉన్నారు. రెండు నౌకలు టాంజానియో జెండాలతో నడుస్తున్నాయి.
రష్యా న్యూస్ ఏజన్సీ టాస్ తెలిపిన సమాచారం ప్రకారం..ఒక నౌక నుండి మరొక నౌకలోకి ఇంధనం మారుస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన క్యాండీ అనే నౌకలో 17మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది టర్కీ పౌరులు, ఏడుగురు భారతీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు తీర ప్రాంత రక్షణదళ అధికారులు వెల్లడించారు.
ఒక నౌకలో మొదట పేలుడు సంభవించి మంటలు మరో నౌకకు విస్తరించాయి. ప్రమాదం జరగడంతో రెండు నౌకల్లోని 32మంది సముద్రంలోకి దూకారని వారిలో ఇప్పటి వరకూ 12మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి చేర్చారని వార్తీ సంస్థ తెలిపింది. మిగిలిన వారిలో 11మంది మృతి చెందగా తొమ్మిది మంది నావికుల ఆచూకి తెలియరాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలు జాప్యం అవుతున్నాయి.