విజయవాడలోని కోవిడ్ చికిత్సా కేంద్రంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
కొవిడ్ కేర్ సెంటర్గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో కొవిడ్ బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను రక్షించండి అంటూ కిటికీల్లోంచి కేకలు వేశారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్లో మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో 30 మంది కొవిడ్ బాధితులు, మరో 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కరోనా బాధితులను అంబులెన్సుల్లో వేరే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై రాష్ట్ర హోమ్ మంత్రి సుచరిత వెంటనే స్పందించారు. ఘటనపై ఆరా తీసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా తెలుస్తోందన్నారు. ప్రమాద ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని అధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు.