Fire Accident: విజయనగరంలోని విశాల్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణం గా కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. మొదట మొదటి అంతస్తులో మొదలైన మంటలు నెమ్మదిగా మూడవ అంతస్తుకు వ్యాపించాయి. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేసినప్పటికీ భారీ ఆస్తినష్టం జరిగింది. మార్ట్ లో బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం కారణంగా కలెక్టరేట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను వేరే మార్గం గుండా మళ్లించారు పోలీసులు. ప్రమాద సమయంలో వినియోగదారులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
తొలుత మార్ట్ తెరిచిన తర్వాత సిబ్బంది లోపల కరెంటు స్విచ్ ఆన్ చేస్తుండగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి అని అంటున్నారు. దీంతో విద్యుత్ షార్ట్ సెర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు విశాల్ మార్ట్ యాజమాన్యం తెలిపింది. ఘటనా స్థలాన్ని ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం డీఎస్పీ త్రినాథరావు యాజమాన్యంతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Breaking: విజయవాడ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం .. ఇద్దరు సజీవ దహనం