కార్వాడ్ (కర్ణాటక): విమానవాహకయుద్ధ నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా నావికా దళ అధికారి ఒకరు మరణించారు. ఈ ఘటన కర్నాటకలోని కార్వాడ్లో చోటుచేసుకున్నది.
భారత ఏకైక విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. కర్నాటకలోని కార్వాడ్లో హార్బర్లోకి ప్రవేశించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ మరణించారు.
‘లెఫ్టినెంట్ కమాండర్ ధైర్యంగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలను అదుపు తెచ్చే క్రమంలో దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఆయన స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని నేవీ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది’ అని నౌకాదళం ఒక ప్రకటనలో వెల్లడించింది. అగ్ని కీలలు పక్క కంపార్ట్మెంట్లకు వ్యాపించకుండా నివారించడంలో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారనీ, ఎక్కువ నష్టం జరగకుండా మంటలు అదుపుచేశారనీ పేర్కొంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు(20 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు) కలిగి ఉంది. దీని బరువు 40 వేల టన్నులు. భారత నౌకాదళంలో అత్యంత భారీ, బరువైన నౌక ఇదే. విక్రమాదిత్య ఖరీదు 2.3 బిలియన్ డాలర్లు. ఇది భారత నౌకాదళంలోకి 2013లో ప్రవేశించింది.