ఎట్టకేలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 16 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులు అయిన సంగతి తెలిసిందే.
అందుకే రాష్ట్రంలో నెలనుకొన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ ప్రసంగం నేరుగా జరగబోదని మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడుతారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇదిలా ఉండగా 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులని అసలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తున్న విషయం తెలిసిందే.
ఇలాంటి సమయంలో 60 ఏళ్లకు పైబడిన సభ్యులు సభకు హాజరు కావాలా వద్దా అన్న విషయాన్ని సభ్యులకే వదిలేస్తున్నామని ప్రకటించిన స్పీకర్ అధికారికంగా మాత్రం ఎవరిని రావద్దు అని చెప్పలేము అని కూడా అన్నారు. ఇకపోతే ఇప్పటి వరకు చరిత్రలో ఏనాడూ గవర్నర్ వీడియో ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం దృష్త్యా ఈ నిర్ణయాన్ని అన్ని పక్షాలూ స్వాగతించాల్సి ఉంది.