నేషనల్ ఐడెండిటీ కార్డులను ధ్రువీకరించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా సింగపూర్ ప్రభుత్వం నూతన తరహా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అక్కడి పౌరులకు చెందిన నేషనల్ ఐడీ కార్డులను వెరిఫై చేసేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడనున్నారు. దీని వల్ల పౌరులు ప్రభుత్వ, ప్రైవేటు సేవలను మరింత సులభంగా వినియోగించుకునేందుకు వీలు కలుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు.
కాగా సదరు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని యూకేకు చెందిన ఐప్రూవ్ అనే కంపెనీ డెవలప్ చేసింది. దీన్ని ముందుగా సింగపూర్లోని ఓ బ్యాంకులో ట్రయల్స్ చూశారు. ఈ క్రమంలోనే ఆ ట్రయల్స్ సత్ఫలితాలను ఇవ్వడంతో అక్కడి ప్రభుత్వం ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో సింగపూర్ పౌరులు తమ ఫేస్ను స్కాన్ చేసి తమ నేషనల్ ఐడెంటిటీని ధ్రువీకరించాలి. తరువాత ఏ సేవనైనా పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఈ టెక్నాలజీ ద్వారా మోసాలు తగ్గుతాయని సింగపూర్ అధికారులు తెలిపారు. దీని సహాయంతో వ్యక్తులు నిజంగానే నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్నారా, లేక వారి ఫొటోలు, రికార్డెడ్ వీడియోలను చూపిస్తూ ఐడీని కన్ఫాం చేస్తున్నారా ? అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. అలాగే నేరస్థులను పట్టుకోవడం కూడా పోలీసులకు తేలికవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వల్ల పౌరుల వ్యక్తిగత జీవితాలకు చెందిన విషయాలను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేసేందుకు వీలుంటుందని నిపుణులు అంటున్నారు. కాగా దీనిపై సింగపూర్ ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు వస్తే అందుకు అనుగుణంగా స్పందిస్తామని మాత్రం సింగపూర్ ప్రభుత్వం తెలియజేసింది.