అమరావతి: ఓటర్ల జాబితాలో పేరుందో లేదో అందరూ ఒకసారి చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రజలకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఐదు రోజుల సమయమే ఉందని ద్వివేది తెలిపారు. ఓటు లేని ప్రతి ఒక్కరూ ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైనందున ఓటరు జాబితాలో పేర్లు చేర్చేందుకే అవకాశం ఉంటుందని, తొలగింపు కుదరదని ద్వివేది స్పష్టం చేశారు. ఫారం-7 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ద్వివేది ఆదేశించారు.
ఫారం-7 దరఖాస్తులను స్వీకరించటం నిలిపివేయడంతో అధికారులు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఫారం-7 తెచ్చిన తంటాలు అన్నీ ఇన్ని కావు. ఫారం-7 పెట్టిన చిచ్చుతో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి పార్టీల మధ్య నేటికీ మాటల యుద్ధం కొనసాగుతున్నది.
అధికార టిడిపి సైబర్ క్రైంకు పాల్పడిందనీ, తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలిగిస్తూ అనుకూలంగా ఓట్లను చేర్చుతుందని వైసిపి ఆరోపిస్తున్నది. టిడిపి అక్రమాలను అడ్డుకోవటానికి తామే ఫారం -7 ద్వారా డూప్లికేట్ ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని జగన్ అన్నారు. ఫారం-7 దరఖాస్తు ఇచ్చినంత మాత్రాన ఓట్లను తొలగించరనీ, ఎన్నికల సంఘం పరిశీలించి న్యాయం చేస్తుందనీ ఆయన అంటున్నారు.
ఓటు లేకపోతే ఫారం-6 దరఖాస్తును మీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి ఇచ్చి ఓటును నమోదు చేయించుకోవచ్చు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అన్నీ వివరాలు పొందవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనున్నాయి.