తమిళనాడులో శివకాశి చాలా ప్రాముఖ్యమైనది. బాణాసంచా తయారీలో శివకాశి ఎంతో పేరెన్నికగన్నది. దేశం మొత్తానికి ఇక్కడి నుండి టపాసులు మొదలైన బాణాసంచా ఎగుమతి అవుతాయి. దేశంలోని మొత్తం టపాసుల్లో దాదాపు 80 శాతం ఇక్కడే తయారవుతాయి.
అయితే ప్రతీసారి శివకాశి ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. తమిళనాడులోని శివకాశి బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించి ఐదుగురు మృతిచెందారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కడలూరు జిల్లా కట్టమన్నారు కోయిల్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన ఐదుగురిలో నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కర్మాగారాల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.