మహర్నవమి పండుగ వేళ ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి విద్యార్ధులు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సింగ్ నగర్ నుండి ఏడుగురు విద్యార్ధులు మంగళవారం బాపట్ల లోని సూర్యలంక బీచ్ కి వెళ్లారు. వీరు సముద్ర స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉదృతికి ఏడుగురు కొట్టుకుపోయారు. వీరిలో సిద్దు, సాయి మధు, అభి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.గల్లంతు అయిన మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టాయి.
వీరంతా ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్నారని పోలీసులు తెలిపారు. దసరా సెలవులు కావడంతో వీరంతా విజయవాడ నుండి రైలులో బాపట్లకు చేరారు. అక్కడ నుండి ఆటోలో సూర్యలంక కు వెళ్లామని క్షేమంగా బయటకు వచ్చిన బాలుడు తెలిపారు. పండుగ పూట బాలురు మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.