సూళ్లూరుపేట, జనవరి 20: నెల్లూరు జిల్లా విదేశీ విహాంగాల విడిది కేంద్రాలకు పండుగ కళ వచ్చింది. పక్షుల పండుగ సందర్భంగా తరలివచ్చే సందర్శకులకు పులికాట్ సరస్సు, నేలపట్టులో విహాంగాల కిలకిలరావాలు, తెరచాప పడవల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి,
రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టివల్) వైభవంగా నిర్వహిస్తుంది.
మూడు రోజుల పాటు జరిగే ఈ పక్షుల పండుగను సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ఆవరణలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పొంగూరు నారాయణలు ఆదివారం ప్రారంభించారు.
ఈ పక్షుల పండుగ కోసం వచ్చే పర్యాటకుల కోసం అధికారులు బివిపాలెం పడవల రేవు వద్ద ఉచితంగా బోటు షికారు చేసేందుకు, పులికాట్ను సందర్శించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో సినీ తారలతో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.