(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గత రెండు రోజులుగా భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జరమయం అయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాలకు కృష్ణానదికి వరద ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రభావం ఉంది. నేటి నుండి 16వ తేదీ వరకూ కృష్ణానదికి వరద ప్రభావం 5 నుండి 6 లక్షల క్యూసెక్కుల వరకూ వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ
కృష్ణానది కరకట్ట లోపల వైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు రెవెన్యూ అధికారులు వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. కరకట్ట లోపల వైపు ఉన్న భవనాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తాడేపల్లి తహశీల్దార్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. కరకట్టపై ఉన్న నివాసాలలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తం చేయడానికి మాత్రమే ఈ నోటీసు జారీ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.
గతంలో కృష్ణానదికి భారీగా వరద వచ్చినప్పుడూ చంద్రబాబు నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లోని నివాసదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.