అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు కరోనానే అనుకుంటే.. మరోవైపు వరదల ముప్పు కూడా ఉంచి ఉంది. ఇప్పటికే అక్కడ ఓ అర్చకుడితోపాటు 16 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ భూమి పూజ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే తాజాగా అయోధ్యకు వరదల ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.
గంగానది నుంచి ప్రవహించే ఉపనది ఘాగ్రా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని, అందువల్ల వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగానే ఈ వరదలు సంభవిస్తున్నాయన్నారు. అయితే ఆగస్టు 5వ తేదీ వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు. దీంతో అయోధ్యకు ప్రస్తుతం కరోనాతోపాటు వరదల భయం పట్టుకుంది.
కాగా భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిపి మొత్తం 150 మంది వరకు అతిథులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో అదే రోజు రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే వరదల ఎఫెక్ట్ అయోధ్య భూమి పూజపై ఏ మేర పడుతుందనే విషయం తెలియాల్సి ఉంది.