ఏ విషయం మాట్లాడాలన్నా.. కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని స్టార్ట్ చేయాల్సి వస్తోంది. అవునుమరి కరోనా చేసిన నష్టం అంతటిది. అలాంటి ఒక విషయమే.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు. కరోనాకు ముందు.. టిఫిన్స్ నుంచి బిర్యానీ వరకూ.. ఛాయ్ నుంచి కూల్ డ్రింక్స్ వరకూ.. ఏది కావాలన్నా.. క్షణాల్లో మన ముందుకు తెచ్చేవి.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థలు ఇప్పుడు చతికిల పడుతున్నాయి. ఇలా ఫుడ్ డెలివరీలు తగ్గితే.. బిజినెస్ ఎలా చేసుకోవాలిరా నాయనా అంటూ నెత్తికొట్టుకుంటున్నాయి.
కరోనా వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకుదేలైన విషయం అందరికీ తెలిసిందే.. దీంతో కొందరి ఉద్యోగాలు పోయాయి. మరి కొన్నికంపనీలు కనిపించకుండా పోయాయి. కంపనీల్లో ఉన్న కొందరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో మెట్రో నగరాలు కాస్త ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ తీసుకునేవారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో పేర్కొన్నాయి. అదే సమయంలో.. చిన్న నగరాల్లో మాత్రం ఫుడ్ డెలివరీలు పెరిగాయని ఈ డెలివరీ సంస్థలు చెబుతున్నాయి. కరోనా వల్ల మెట్రో నగరాల్లో నుంచి చాలా మంది సొంతుళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.. దీంతో చిన్న నగరాల్లో ఫుడ్ డెలివరీలు రెట్టింపు అయినట్లు ఫుడ్ డెలివరీ సంస్థలు చెబుతున్నాయి.
కోల్కతా, కొచ్చి, లక్నో, వైజాగ్ లాంటి నగరాల్లో కరోనా వైరస్ రాకంటే మందుకన్నా.. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఫుడ్ డెలివరీల సంఖ్య ఎక్కవగా ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి చెబుతోంది. బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మాత్రం ఫుడ్ డెలివరీలు రోజురోజుకూ పడిపోతున్నాయని చెబుతోంది. పెద్ద నగరాల్లో ఆర్డర్ల సంఖ్య తక్కువగా ఉందని డెలివరీ సంస్థ జొమాటో చెబుతోంది. చిన్న నగరాల్లో ఇప్పుడు బిజినెస్ బాగుందని చెబుతోంది. ముందు మెట్రో నగరాల్లో యాప్ వాడిన వారిలో చాలా మంది ఇప్పుడు చిన్న నగరాల్లో యాప్ ను ఉపయోగిస్తున్నారని చెబుతోంది. మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీలు ఎప్పుడు ఎక్కువైతాయో చెప్పలేని స్థితిలో ఉన్నట్లు డెలివరీ సంస్థలు పేర్కొంటున్నాయి.