Food, ఈ నాటి తీరిక లేని జీవితంలో.. తినవలిసిన సమయానికి సరైన తిండి తినక పోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలా సమయం సందర్భం లేకుండా అధిక కాలరీలు ఉండే ఆహారం తీసుకోవడమే కాకుండా.. అందుకు తగినట్టుగా వ్యాయామం చేయకపోవడం.. అధిక బరువుకు ప్రధాన కారణమవుతుంది. రోజులో మనం తీసుకునే మొదటి ఆహారం బ్రేక్ఫాస్ట్. దీనితో మన జీవక్రియ మొదలవుతుంది కాబట్టి మన శరీరానికి తగిన శక్తి నిచ్చేలా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి.
బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ముందు రోజు రాత్రి సమయంలో చేసిన డిన్నర్కు, బ్రేక్ఫాస్ట్కు మధ్య కనీసం 12 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాత్రి 8.30 గంటలకు డిన్నర్పూర్తి చేయడం మంచిది. అలా చేయడం ద్వారా ఉదయం 8.30 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక ప్రతి రోజు డెటాక్స్ వాటర్తో రోజును ముగించడం తో పాటు బ్రేక్ఫాస్ట్కు 15 నిమిషాల ముందు కొద్దిగా నీటిని తాగడం చాలా మంచిది .
ఇక మధ్యాహ్నం తినే భోజనం చాలా ముఖ్యమయినది . భోజన సమయంలో మీకు ఏదైనా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని కోరిక ఉంటే,అది తక్కువ పరిమాణంలో ఉండేలాచూసుకోవాలి. ఉదయం 8 గంటల సమయంలో బ్రేక్ఫాస్ట్ చేస్తే.. మధ్యాహ్నం 1 నుంచి 2 రెండు గంటల మధ్య భోజనం తినడం అనేది మంచిది. ఇలా చేయడం వలన భోజనంబాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది .
రాత్రిపూట తీసుకునే భోజనం ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోవడానికి సరిగ్గా రెండు, మూడు గంటల ముందు డిన్నర్ పూర్తి చేయడం చాలా అవసరం. ఇలా చేయడం ద్వారా నిద్రపోవడానికి ముందే శరీరం లోని కొన్ని కాలరీలు కరిగిపోతాయి. అదే తినగానే నిద్రపోవడం వలన జీర్ణ ప్రక్రియ మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇలా తినగానే పడుకోవడం వలన ప్రశాంతమైన నిద్ర రాదు. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. అందుకే రాత్రి 8 గంటల లోపు డిన్నర్ చేసేయడం వలన కాలరీలు కరిగించడం తో పాటు, రక్తం లోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి అనుకూలం గా ఉంటుంది.