ఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై నిందలు వేయటం మాని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ హితవు పలికారు.
సంపత్ బుధవారం ఒక ఛానల్కు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈవిఎంలు, వివిప్యాట్లను హ్యాక్ చేయడం ముమ్మాటికీ అసాధ్యమన్నారు. ఎన్నికలలో ఓడిన తర్వాత ఆయా పార్టీల నేతలు ఈవిఎంల పని తీరుపై అనుమానం వ్యక్తం చేయటం, విమర్శించటం సహజమని సంపత్ చెప్పారు. కానీ ఈ సారి ఫలితాలు రాకముందే విమర్శలు ప్రారంభించారని సంపత్ పేర్కొన్నారు. ఒక ఎన్నికలో ఓడిపోతే విమర్శిస్తారు. అదే మరో ఎన్నికలో వీరే గెలిస్తే మళ్ళీ ఈవిఎంల ఊసే ఎత్తారు అని సంపత్ అన్నారు.
వివిప్యాట్ లను ప్రవేశపెట్టటానికి ముందు కేంద్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందనీ, ఆ సమావేశంలో మెజారిటీ పార్టీలు బ్యాలెట్ పేపర్ పోలింగ్ వద్దని అన్నాయనీ సంపత్ తెలిపారు. 50 శాతం వివిప్యాట్లు లెక్కించే బదులు బ్యాలెట్ పోలింగ్ నే జరపవచ్చని సంపత్ అభిప్రయపడ్డారు.
బ్యాలెట్ లెక్కింపు సుదీర్ఘ ప్రక్రియ అని సంపత్ అన్నారు. లెక్కింపు సులభతరం అవ్వటంతో పాటు, వేగంగా ఎన్నికల ఫలితాలు వస్తాయనే ఎన్నికల సంఘం ఈవిఎంలను ప్రవేశపెట్టిందని సంపత్ వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల నిర్వహణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిస్థాయి అధికారాలు సంక్రమిస్తాయని సంపత్ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఎన్నికలలో పాల్గొనేందుకు అవసరమైతే చట్టం పరిధి అతిక్రమించి కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవచ్చని సంపత్ పేర్కొన్నారు.