దివంగత ముఖ్యమంత్రి జయలలిత పొయెస్ గార్డెన్ నివాసం వేదనిలయం సహా ఆమెకు చెందిన నాలుగు స్థిరాస్థులు ఆదాయం పన్ను శాఖ జప్తులో ఉన్నాయట. అది కూడా 2007 నుంచి. ఇంత వరకూ ఈ విషయం తెలియని రాష్ట్రప్రభుత్వం సంగతి తెలియగానే నోరెళ్లబెట్టింది.
వేదనిలయం భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజాధనంతో దానిని జయలలిత స్మారక భవనంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలయిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మాసనం ముందు హాజరయిన ఆదాయం పన్ను శాఖ న్యాయవాది ఎ.పి శ్రీనివాస్, వేదనిలయంతో పాటు అన్నాసలైలోని ఒక వాణిజ్య సదుపాయం, చెన్నై, సెయింట్ మేరీస్ రోడు లోని మరో ఆస్థి, హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఉన్న భవనం 2007 నుంచి తమ జప్తు కింద ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రప్రభుత్వం తరపున హాజరయిన అడ్వొకేట్ జనరల్ వైద్య నారాయణ్, ఇంతవరకూ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదని చెప్పారు. ఆదాయం పన్ను బకాయిలు కట్టనందుకు ఈ ఆస్థులను జప్తు చేయాల్సివచ్చింది. 1990-91 నుంచి 2011-12 ఆర్ధిక సంవత్సరాల వరకూ జయలలిత పన్ను బకాయిలు వడ్డీతో కలిపి 10.12 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని ఆదాయం పన్ను శాఖ కోర్టుకు తెలిపింది.