Devineni Uma Remand: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఆన్ లైన్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుండి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీనితో దేవినేని ఉమాను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. దేవినేని ఉమాతో పాటు ఆయన డ్రైవర్ ప్రసాద్, తెలుగు యువత నాయకుడు లీలా ప్రసాద్ కి కూడా కోర్టు రిమాండ్ విధించింది.
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని అరోపిస్తూ నిన్న రాత్రి దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. అక్కడ నుండి తిరిగి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం గడ్డమణుగు వద్ద ఆయనను కొందరు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. అయితే దేవినేని ఉమానే కావాలని అలజడి సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దేవినేని ఉమాపై పోలీసులు 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలో దేవినేని ఉమను అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నందివాడ పోలీస్ స్టేషన్ నుండి భారీ పోలీసు భద్రత మధ్య ఉమను మైలవరం కోర్టుకు తరలించే ప్రయత్నం చేయగా పోలీస్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు అడుగడుగునా ప్రయత్నించారు. దీంతో ఆయనను నేరుగా కోర్టుకు తీసుకువెళ్లకుండా హనుమాన్ జంక్షన్ కు తరలించి అక్కడి నుండి జూమ్ యాప్ ద్వారా వర్చువల్ గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట హజరుపర్చారు.