(రాజమండ్రి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు గెలిచిన హర్షకుమార్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు.
2019 ఎన్నికల్లో తొలుత టీడీపీ ద్వారా ఆ తరువాత వైసీపీ ద్వారా అమలాపురం పార్లమెంట్ టికెట్ ఆశించినప్పటికీ సానుకూల సంకేతాలు రాకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా సైలెంట్గా ఉండిపోయారు. ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒ కేసులో ఆయనను అరెస్టు చేయడంతో కొద్ది రోజులు అండర్ ట్రైల్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. దళిత, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.
నేడు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు హర్షకుమార్. రాహుల్ గాంధీ, ప్రియాంకలు దళితుల పక్షాన చేస్తున్న పోరాటంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుందని హర్షకుమార్ అన్నారు. దేశంలో బీజేపీకీ కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు హర్షకుమార్.
కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కరోనా కారణంగా చాలా మంది మృతి చెందుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ లెక్కలు ప్రకటించడం లేదని హర్షకుమార్ ఆరోపించారు. మహిళలపై అత్యాచార సంఘటనలు ఉత్తరప్రదేశ్ తరహాలో ఏపిలో జరుగుతున్నాయని, ఏపి రెండవ స్థానంలో ఉందని హర్షకుమార్ అన్నారు.