పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తన సస్పెన్షన్ పై పొంగులేటి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు పొంగులేటి. తాను పార్టీ సభ్యుడినే కానన్నప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నాంచారు. జనవరి నెల నుండి తాను ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాననీ, అయితే వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ నేతలు ధైర్యం తెచ్చుకుని సస్పెండ్ చేశారని అన్నారు.

ఖమ్మంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. తాను వైసీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లోకి రావాలని చాలా సార్లు అహ్వానించారని చెప్పారు. మంత్రి కేటిఆర్ తనపై ఒత్తిడి తీసుకుని వచ్చి అనేక మార్లు సీఎం వద్దకు తీసుకువెళ్లారని చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారనీ, ఆయన మాటలు నమ్మి పార్టీలో చేరానని తెలిపారు. తాను పార్టీ లో చేరిన సమయంలో చాలా మంది బీఆర్ ఎస్ నేతలు తమకు పట్టిన గతే పడుతుందని చెప్రారన్నారు. పాలేరు ఉప ఎన్నికల విజయం కోసమే తనపై ఒత్తిడి తెచ్చారన్నారు.
ఆరు నెలల తర్వాత మా సార్ అసలు రూపం తెలుస్తుందని అప్పటి తన సహచర ఎంపీలు చెప్పారన్నారు. ఆరు నెలలు కాకుండా తన విషయంలో అయిదు నెలల్లోనే పరిస్థితి అర్ధం అయ్యిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా మంత్రి కేటిఆర్ కోసమే పార్టీలో ఉన్నానని పొంగులేటి అన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టిననా పార్టీలో కొనసాగానని తెలిపారు. 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుండి ఒక్క ఎమ్మెల్యేనే గెలవడానికి కారణం ఏమిటో చర్చించారా అని అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ వర్సెస్ కమ్యునిస్టులు అని చెప్పారు.
గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సొంత క్యాడర్ ను అభివృద్ధి చేసుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ వర్గం ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ పార్టీ మార్పుపై స్పష్టమైన వైఖరి తెలియజేశారు కానీ, ఏ పార్టీ లోకి వెళతారు అనేది మాత్రం ఇంత వరకూ వెల్లడించలేదు. తొలుత కాంగ్రెస్, బీజేపీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీ చేరబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన వర్గీయులందరికీ రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవాలంటే అది వైఎస్ఆర్ టీపీలో చేరితేనే సాధ్యం అవుతుంది. బీజేపీలో చేరితే కొంత మందికి మాత్రమే సీట్లు ఇప్పించుకునే అవకాశం కలుగుతుంది.
పొంగులేటి జిల్లాల్లో తన వర్గీయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడంతో పాటు వేరే జిల్లాలో అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ అసంతృప్తి వాదులందరినీ కలుపుకుని కొత్త పార్టీ పెట్టే యోచన కూడా చేస్తున్నారన్న మాట వినబడుతోంది. చాలా కాలంలో బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పొంగులేటి చర్చలు జరపడంతో పాటు నిన్న కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో కేసిఆర్ పైనా, ఆయన కుటుంబంపైనా వీరు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పార్టీ అధిష్టానం సీరియస్ గా రియాక్ట్ అయి పొంగులేటి, జూపల్లిలను సస్పెంచ్ చేసింది.