అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నరసరావుపేటలో బుధవారం నిర్వహించనున్నారు. కోడెల భౌతికకాయాన్ని మంగళవారం ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్ నుండి నకిరేకల్, చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ, మంగళగిరి మీదుగా గుంటూరు తరలిస్తారు. కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రెండు గంటల పాటు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఉంచి సాయంత్రం నాలుగు గంటలకు నరసరావుపేట తరలిస్తారు. బుధవారం ఉదయం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరో పక్క కోడెల మృతి నేపథ్యంలో పల్నాడులో రెవెన్యూ, పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నర్సరావుపేట డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 30 వరకూ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆర్డిఒ వెంకటేశ్వర్లు తెలిపారు.