శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన మకాం ను సింగపూర్ నుండి థాయ్ లాండ్ కు మార్చుకుంటున్నారు. దేశ ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక శ్రీలంక నుండి గొటబాయ పరారైన సంగతి తెలిసిందే. తొలుత శ్రీలంక నుండి మల్దీవులకు అక్కడ నుండి సింగపూర్ కు చేరుకున్నారు. గత నెల 13వ తేదీన దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తొలుత మాల్దీవులకు వెళ్లగా అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం కావడంతో సింగపూర్ చేరుకున్నారు. అయితే తాము గొటబాయకు ఆశ్రయం కల్పించలేదనీ, టూరిస్ట్ వీసా పైనే వచ్చారని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది.
సింగపూర్ లోనూ గొటబాయ రాజపక్స వీసా గడువు ముగిసింది. దీంతో ఆయన థాయ్ లాండ్ ప్రభుత్వానికి ఆశ్రయిం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నపానికి థాయ్ లాండ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆశ్రయమిచ్చేందుకు ఒకే చెప్పిన థాయ్ లాండ్ ప్రభుత్వం.. కేవలం మానవతా దృక్పదంతోనే తాత్కాలికంగా తమ దేశంలో ఉండేందుకు అవకాశం ఇస్తున్నామని తెలిపింది. అయితే తమ దేశంలో ఉంటూ రాజకీయ కార్యకలాపాలను నిర్వహించకూడదన్న షరతు విధించింది. గొటబాయ రాజపక్సకు థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ అనుమతి ఇచ్చినట్లు బ్యాంకాక్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. దీంతో గొటబాయ రాజపక్స థాయ్ లాండ్ కు బయలుదేరి వెళ్లనున్నారు.