చెన్నై: చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా ఆయన మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ శివప్రసాద్కు చికిత్స కొనసాగుతోంది. అయితే, శివప్రసాద్ చనిపోయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం ఫేక్ అని తేలింది. శివప్రసాద్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శివప్రసాద్కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. శివప్రసాద్ మరణించినట్లుగా వస్తున్న వార్తలను ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు. అధికారికంగా తాము ప్రకటించే వరకూ వందతులను నమ్మవద్దని ఆయన కోరారు. మరోవైపు శివప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెన్నైకి బయలుదేరుతున్నారు.
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.
శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి. 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.