ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు చేపట్టినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల వరకు లోక్సభ నుండి సస్పెండ్ చేశారు. తొలుత నిరసన తెలియజేయాలనుకుంటే సభ వెలుపల ప్లకార్డులతో నిరసన చేసుకోవాలని స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్ వారించినా ఆందోళన కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, జోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్ లను స్పీకర్ సస్పెండ్ చేశారు.
అనంతరం స్పీకర్ చర్యను నిరసిస్తూ పార్లమెంటు మైదానంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. ఎంపీల్లో కొందరిని సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అంశాలను లేవనెత్తేందుకు తమ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. అయితే లోక్సభ స్పీకర్ తాను మధ్యాహ్నం 3 గంటల తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నానని చెబుతూ సభలో ఎలాంటి ప్లకార్డులతో నిరసనను సహించబోనని ప్రతిపక్ష ఎంపీలను హెచ్చరించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో తిరిగి వచ్చారు. సభలో నిరసన కొనసాగిస్తుండటంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.