తెలంగాణలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధికార టీఆర్ఎస్ తో సహా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీలోకి ఆహ్వానిస్తొంది. చేరికల కమిటీ కన్వీనర్ గా మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారు అయ్యింది. అమిత్ షా సమంక్షంలోనే పలువురు నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
టీఆర్ఎస్ నేత, మంత్రి యర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కన్నెబోయిన రాజయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ తదితరులు వారి అనుయాయులతో అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ మీడియాకు తెలిపారు. ఈ నెలలో భారీగా చేరికలు ఉంటాయని గత నెలలోనే ఈటల రాజేందర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి నేతలు రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ , టీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీల నుండి చేరికల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటునకు బీజేపీ రంగం సిద్దం చేస్తొంది.