చిన్న పిల్లలు చేసే చేష్టలు నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి.. ! వారు చేసే ముద్దు ముద్దు పనులు వారికే కాదు వారిని చూసే వాళ్లకు సైతం అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రులైతే ఆ పిల్లల గురించి తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి వారు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మరీ ముఖ్యంగా వారికి ఆట బొమ్మలు కొనివ్వడంలో చాలా ముందుంటారు.
అయితే, తన కుమారుని ఆనందం కోసం కొనిచ్చిన ఆట బోమ్మలే.. ఆ బాలుడి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాయి. అంటే, ఆ ఆటబోమ్మలతో ఆడుకుంటున్న బాలుడు.. ఆ బోమ్మలతోనే తన ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. ఎలా అనుకుంటున్నారా? తాను ఆడుకోవడానికి తీసుకున్న అయాస్కాంతాలను మింగేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 అయస్కాంతాలను మింగేశాడు. ఈ ఘటన ఇండియానాలో చోటుచేసుకుంది. మ్యాక్ నెయిర్, జెస్సికా దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
అయితే, బొమ్మలతో ఆడుకుంటున్న ఆ బాలుడు ఉన్నట్టుండి ఏడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆ బాలున్ని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని ఎక్స్రే తీయగా.. మొత్తం 27 అయస్కాంతాలను మింగేసినట్టు వైద్యులు గుర్తించారు. ఈ 27 అయస్కాంతాల్లో 25 కడుపులో ఉండగా..మరో రెండు గొంతులు ఉన్నాయి.
ఈ రెండు మాగ్నెట్ బాల్స్ బాలుడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి తీసుకోవడానికి అడ్డుగా నిలిచాయి. దీంతో బాలుడు ఏడవడం మొదలుపెట్టాడని వైద్యులు తెలిపారు. ఎట్టకేలకు బాలుడి కడుపులోంచి అయస్కాంత బాల్స్ ను వైద్యులు బయటకు తీశారు. దీనిపై బాలుని తల్లీదండ్రులు మాట్లాడుతూ.. అయస్కాంతాలతో ఆడుకోవడం చూశామనీ, అయితే, కొద్ది సేపటి తర్వాత చూస్తే.. ఆవి కనించలేదు. ఇంతలోనే బాలుడు ఏడవడం మొదలు పెట్టాడని వివరించారు. కాగా, ఆ పిల్లవాడు ఆడుకుంటున్న మాగ్నెట్ బాల్స్ చాలా ప్రమాదకరమైనవని వైద్యులు వెల్లడించారు. అలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలనీ, పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టాలనీ, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చూచిస్తున్నారు.