అమరావతి : ఏపీలో చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు దారులకు పంపిణీ చేసే సరుకుల ధరలు జూలై నుండి పెరగనున్నాయి. బియ్యం కేజీ రూపాయి ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ కందిపప్పు పై 67.5శాతం, పంచదారపై 70 శాతం చొప్పన ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్లో వీటి ధరలు ఎంత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ కేజీ కందిపప్పు 40 రూపాయలు, పంచదార అర కిలో 10 రూపాయలు చొప్పున కార్డు దారులకు పంపిణీ చేస్తూ వచ్చింది. అయితే బయటి మార్కెట్ ధరలకు అనుగుణంగా 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కేజీ కందిపప్పు రూ. 67లు, పంచదార అర కిలో రూ.17లకు పెంచారు. కొత్త ధరలను జూలై నుండి అమలు చేసే విధంగా పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా లోక్ డౌన్ మొదలు అయినప్పటి నుండి నెలకు రెండు పర్యాలు చొప్పున ఆరు సార్లు ఇప్పటి వరకు ఉచితంగా రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం జూలై నెల నుండి ఉచిత రేషన్ ను నిలుపుదల చేసింది.
కాగా రేషన్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేషన్ ధరల పెంపు దారుణమని అన్నారు. సర్కార్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటుంది అనే దానికి సరుకుల ధరలు పెంచడమే నిదర్శనం అని విమర్శించారు. కందిపప్పు పై 27 రూపాయలు, పంచదారపై 14 రూపాయలు పెంచడం వల్ల ఏడాదికి పేదలపై 600 కోట్ల రూపాయల భారం పడుతుందని లోకేష్ పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ రెండవ తేదీ నుండి రేషన్ సరుకుల డోర్ డెలివరీకి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.