Fake marriages: ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేస్తుకుంటూ , చట్టానికి దొరక్కుండా అమాయకులను మోసం చేస్తూ తిరిగే నిత్య పెళ్ళి కొడుకులు ,పెళ్లి కూతుళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వివాహాలకు చట్టబద్ధత లేకపోవడం వలన ఇలాంటి మోసాలు రోజు రోజు కి ఎక్కువ అవుతున్నాయి. పెళ్లిళ్లలో ఎలాంటి మోసాలు జరగకుండా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట 2002. వివాహాలను తప్పని సరిగా నమోదు చేయించాలన్నది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ పెళ్ళిళ్ళు కుల మతాలతో సంబంధం లేకుండా ఏ సాంప్రదాయం ప్రకారం జరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించటం జరుగుతుంది.కొన్ని మతాల వారి వివాహాలు వారి మత పెద్దల వద్ద నమోదయి ఉంటాయి . ఇలాంటి వివాహాలు చట్టం ప్రకారం రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. వివాహం జరిగిన 30 రోజుల్లో మ్యారేజ్ ఆఫీసర్ కి వివాహ విషయం తెలియజేయాలి. వధూవరులిద్దరూ రిజిస్టర్ కాపీ లో సంతకం చేయాలి. వధువు తరపున ఇద్దరు, వరుడి తరఫున ఇద్దరు సాక్షులు కూడా దాని పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నిబంధన ప్రకారం, ఆ వివరాలను రిజిస్టర్ లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వధూ వరుల ఇద్దరికి వివాహ ధ్రువపత్రం అందజేస్తారు. దీంతో ఆ వివాహానికి చట్టబద్ధత వస్తుంది.ఉద్దేశ్య పూర్వకంగా లేదా అశ్రద్ధ తో అయిన వివాహాన్ని రిజిష్టర్ చేయించకుండా ఉంటే వధూవరులిద్దరూ తరుపున వెయ్యి రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది.
అయితే వివాహాం సందర్భంగా వధువు, వరుడి కి సంబంధించిన వయస్సు, ఉద్యోగం, చదవు, సాక్షులతో బంధుత్వం తదితర వివరాలను రిజిస్ట్రార్ కు అందజేయవలసి ఉంటుంది. వివరాల లో ఏదైనా తప్పుడు సమాచారం అందించడం నేరం. అలాంటి వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. వివాహాన్ని సరైన సమయంలో రిజిస్ట్రార్ చేయని ఆఫీసర్ కి కూడా మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 వరకు జరిమానా వేసే అవకాశం ఉంది. ఇవన్నీ కచ్చితం గా ఫాలో అయితే మోసాల నుండి బయట పడవచ్చు.