వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఆర్ టీ సీ విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలంగా ఆర్ టీ సీ కార్మికుల డిమాండ్ పరిష్కారం అయి కండక్టర్లు, డ్రైవర్లు కార్పోరేషన్ ఉద్యోగుల నుండి ప్రభుత్వ ఉద్యోగులు అయి పోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే వారికి పెన్షన్ ఇతర సదుపాయాలు కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది.
ఆర్ టీ సీలో దాదాపు ఐదు వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు ప్రతి రోజు తమ నివాసాల నుండి డిపో, యూనిట్లకు తమ సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థలో పని చేస్తున్న తమకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని వారు కొంత కాలంగా కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్ టీ సీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లై పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జనవరి 1వ తేదీ నుండి దీన్ని అమలు చేయనున్నది.
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించడం కోసం ఈ ఉచిత బస్సు పాస్లు మంజూరు చేస్తున్నట్లు ఆర్ టీ సీ ఎండి కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాసులు చెల్లుబాటు అవుతాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది జనవరి ఒకటవ తేదీ నుండి వారు తమ నివాసం నుండి 25 కిలో మీటర్ల లోపు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.