ఎంతో మంది గ్యాంగ్ స్టార్లు వస్తుంటారు. పోతుంటారు. కానీ ఎలా వచ్చారు..? ఏం చేసారు..? ఎలా పోలీసులకు దొరికారు..? ఎలా వాపోయారు అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే…! ఇదే కోవలోకి వికాస్ దూబే కూడా చేరుతారు. ఎనిమిది మంది పోలీసులను కాల్చేశారన్న కేసులో ఎప్పటి నుండో యూపీ పోలీసులు వికాస్ కోసం గాలిస్తున్నారు. అతను దొరికిన 24 గంటల్లోనే నిర్జీవిగా మారారు. అలా వికాస్ దూబే కథ ముగిసింది.
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతమయ్యారు. ప్రత్యేక వాహనంలో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లిన పోలీసులు అతన్ని ఎం కౌంటర్ చేసారు. ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ఈయన. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా.. అతడు మరణించినట్లు తెలుస్తోంది. కాగా వికాస్ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం.
మధ్యప్రదేశ్లో దూబే అరెస్ట్
ఎనిమిది మందిని పొట్టనబెట్టుకుని ఉత్తరప్రదేశ్లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న వికాస్ దూబేను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి అనుచరులు.. పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత గురువారం జరిగిన కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. ఈ క్రమంలో వికాస్ అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతడు సంచలన విషయాలు వెల్లడించాడు.