విజయవాడ: టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుందనీ, ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గన్నవరం వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి తాను కొత్త గానీ తన కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదని వెంకట్రావు తెలిపారు. ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పేరు పెట్టి ఎక్కడా తాను విమర్శలు చేయలేదనీ, ప్రజలు చెప్పిందే సభలో అన్నానని వెంకట్రావు వెల్లడించారు.
వంశీతో తనకు వ్యక్తిగతంగా ఇప్పటి వరకూ పరిచయం కూడా లేదని వెల్లడిస్తూ ఆయన మనుషులు, ఆయన తన ఇంటికి వచ్చి వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని వెంకట్రావు అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థి ఇంటికి వెళ్లి సన్మానం చేసే సంస్కృతి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తాను ఏమీ ఫిర్యాదు చేయలేదని వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ సిపి కలవమని కబురు చేస్తే దాసరి బాలవర్థనరావుతో వెళ్లి సిపిని కలిసినట్లు వెంకట్రావు చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు ఒక గన్మెన్ను ఇప్పటికే ఇచ్చారనీ, తాను మళ్లీ గన్ మెన్ కావాలని ఎందుకు కోరతానని వెంకట్రావు ప్రశ్నించారు.
తనపై కావాలనే వంశీ అసత్య ప్రచారం చేస్తున్నారనీ, తాను ఏదో భయపడిపోయి సిపిని కలిసి ప్రాణహాని ఉందని వేడుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తూ ఫేస్ బుక్ ద్వారా లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భయపడే వాడినైతే ఆమెరికా నుండి గన్నవరంలో పోటీ చేయడానికి వచ్చే వాడినే కాదనీ వెంకట్రావు అన్నారు.
నియోజకవర్గంలో వంశీ అరాచకాలు, దోపిడీలు ప్రజలే చెప్పారని వెంకట్రావు అన్నారు. తాను అమెరికా నుండి వచ్చి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించాననీ, దోచుకుందామని కాదని వెంకట్రావు పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే వంశీ అక్రమాలపై విచారణ జరుపుతారన్న భయంతోనే ఆయన తనపై దుష్రచారం చేస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు.