Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఇప్పటికే తాను రాజీనామా చేశానన్నారు. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఇవ్వలేదని కొందరు అంటున్నారని… స్పీకర్ ఏ ఫార్మాట్లో కోరితే ఆ ఫార్మాట్లో ఇస్తున్నానన్నారు. ఈ మేరకు శుక్రవారం మరోసారి కార్మికుల ఎదుటే రాజీనామా చేశారు.కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మికసంఘాల రిలే నిరాహారదీక్షలో రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్కు అందజేయవల్సిందిగా జర్నలిస్టులను కోరారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరారు. స్టీల్ ప్లాంట్ రక్షణకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Vizag Steel Plant : గంటా సరే ..మిగతా వారి మాటేమిటి?
విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికుల ఆందోళనకు గంటా శ్రీనివాసరావు మద్దతు పలికారు.విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది నేతలను కాచుకుని ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటుపరమవుతుందనే వార్తలతో ఏపీలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉనికి కాపాడుకోవాలంటే స్టీల్ ప్లాంట్పై పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నేతలది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఇంకా విశాఖ లో చాలామంది అగ్ర నేతలున్నారు.వారు ఏం చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.
ఒకే వేదికపై గంటా ..అవంతి !
విశాఖ ఉక్కు ఉద్యమంలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఒకే వేదికపై గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు దర్శనమిచ్చారు. మరోవైపు ఉక్కు ఉద్యమం కేంద్రంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు అవంతి శ్రీనివాసరావు.. జగన్ను, గంటా శ్రీనివాసరావు.. చంద్రబాబును ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు.రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగాలన్నారు నారాయణ. ప్లాంట్ నష్టాల్లో ఉంటే ప్రైవేట్ వాళ్లు ఎందుకు కొంటారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను సాధించుకునే వరకూ రాజకీయ విమర్శలకు విరామం ఇవ్వాలన్నారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉద్యమం కొనసాగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ అంశంపై వెంకయ్యనాయుడు స్పందించాలన్నారు.