ఓ వ్యక్తి తన ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేస్తుండగా, గ్యాస్ సిలెండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటన హైదరాబాద్ నగర శివారు శేరిలింగంపల్లి పరిధిలోని రైల్ విహార్ కాలనీలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన వారు నగరానికి వలస వచ్చి రైల్ విహార్ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఐస్ తయారు చేసి విక్రయాలు చేస్తుంటారు.
ఈ క్రమంలో ఐస్ తయారు చేస్తుండగా, ప్రమాదవశాత్తు గ్యాస్ సిలెండర్ పేలింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంటి పైకప్పు శిధిలాల కింద నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు భయాందోళనకు గురైయ్యారు.