(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ గీతం విశ్వవిద్యాలయానికి హైకోర్టులో ఊరట లభించింది. విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవెన్యూ, గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జీవిఎంసి) అధికారులు శనివారం తెల్లవారుజాము నుండి ఉదయం 11 గంటల వరకూ ఎక్స్ కవేటర్లతో కూల్చివేశారు. గీతం ప్రధాన ద్వారం, ప్రహరీని కూల్చివేశారు. గీతం మెడికల్ కళాశాల వెనుక ప్రహరీనీ పడగొట్టారు. క్రీడా మైదానాన్ని అడ్డంగా ఎక్స్ కవేటర్ తో తవ్వేసి రెండుగా విభజించారు. ప్రాంగణంలోని గాంధీ విగ్రహం, వ్యవస్థాపకుడు ఎంవివిఎస్ మూర్తి విగ్రహానికి ఎదురుగా స్తంభాలను పాతించి కంచె వేశారు. ఆయా ప్రాంతాల్లో కంచె వేసి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. గీతం విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు ఖండించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటూ ఆరోపించారు.
యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపుపై హైకోర్టులో యాజమాన్యం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై శనివారం రాత్రే సోమవారం వరకూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం.. నేడు పిటిషన్పై విచారణ జరిపింది. నిర్మాణాల క్రమబద్దీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండగా కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు కట్టడాలను కూల్చివేశారంటూ యాజమాన్యం తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నిర్మాణాల కూల్చివేతపై ధర్మాసనం స్టే ఇస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.